Sunday, August 19, 2012

సనాతన వైదిక ధర్మం - 5

ధర్మం అంటే ?


'వేదోఖిలో ధర్మ మూలం' వేదం అనేది మన ఆచరించాల్సిన సాధనాలను తెలిపేవి. వేదాలు తెలిపిన నియమాలని, ఆచరణని పాటించడమే ధర్మం అంటే. 'ధ్రియతే ధారయతే ఇతి ధర్మః'. 'ధారయతే' - మనం చేయాల్సిన సాధన. ముందు మనం ఆచరిస్తాం, 'ధ్రియతే' ఆపై ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఉదాహరణగా ముందు మనం సైకిల్ నడపడం నేర్చుకుంటాం, ఆతరువాత అదే మనల్ని నడిపిస్తుంది. అట్లా ధర్మాన్ని మనం మొదట ఆచరిస్తే, అది మనల్ని కాపాడుతూ సులువుగా మన లక్ష్యం వైపు తీసుకెళ్తుంది. మరొక ఉదాహరణగా ఒక గింజను మనం నేలలో నాటి నప్పుడు, అది వృదా అయినట్లు అని పిస్తుంది, కానీ కొంతకాలానికి తనలోంచి అనేక గింజలను పుట్టిస్తుంది. అట్లా మనం చేసే సాధన కొంత కష్టంగా అనిపించినా అది మనకు ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. ఇలా ధర్మాన్ని మన పూర్వులైన ఋషులు ఆచరించి ఫలితం పొందారు. వారు దాన్ని వారి శిష్యులకు అందించారు. విష్ణుసహస్రనామ స్తోత్రంలోని ఉత్తర పీఠికలో 'ఆచార ప్రభవో ధర్మః' అని చెబుతుంది. ఆచరించిన చూపిన వారి ఆచరణలే ధర్మాలు అయ్యాయి. మనం చేయాల్సినదేమి, చేయకూడనిది ఏమి అని విధి నిషేదాలను వేదాలు తెలుపుతాయి. అందుకే మనిషి ఈ ప్రకృతిలో ఎట్లా బ్రతకాలి అనే విషయాలని తెలుపుతాయి వేదాలు.

వేద శాఖలు


ఋషులు మొదట దర్శించిన వేద శబ్దాలను అట్లే వారు తమ శిష్యులకు అందించారు. వేద మంత్రాలలోని ఆయా లక్షణాలను బట్టి ఋగ్వేదం, యజుర్వేదం, సామ వేదం మరియూ ఆదర్వణ వేదం అని నాలుగు భాగాల క్రింద విడదీసి చెబుతారు. అయితే వీటన్నింటినీ ఒకే రాశి క్రింద ఒక్కరే నేర్వగల సామర్థ్యం ఉండేది. అవి కేవలం నోటిద్వారా నేరవాల్సిందే కానీ పుస్తక రూపంలో కాదు. అందుకే వాటిని నిలుపుకునే సామర్థ్యం రానున్న తరాలకు ఉండదని తెలిసి వాటిని వేదవ్యాసుడు కొందరు శిష్యులకు కొంత కొంత విభజించి ఇచ్చాడు. వారు తమ శిష్యులకు మరిన్ని ఉపశాఖలుగా విభజించి ఇచ్చారు. శ్రీమన్నారాయణుడు కూడా వేదాన్ని తయారు చేయలేదు, ఆయన మొదట దర్శించి చతుర్ముఖ బ్రహ్మకు అందించాడు. ఆయన తన పుత్రులకు అందించాడు. ఇలా మన ఋషుల వరకు అందాయి. ఒకప్పుడు మన వద్ద ఉన్న వేద రాశి ఎంతో తెలుసుకుందాం.
వేద వ్యాసుడు మొత్తం వేదాన్ని 1131 శాఖలుగా విభజించాడు. అందులో ఋగ్వేదం 21 శాఖలుగా, యజుర్వేదం 101 శాఖలుగా, సామ వేదం 1000 శాఖలుగా మరియూ ఆదర్వణ వేదం 9 శాఖలుగా ఉండేది.

ఒక్కో వేదం మూడు విభాగాల క్రింద ఉంటాయి అవి.
 1. సంహితలు, 2. ఆరణ్యకములు మరియూ 3. బ్రాహ్మణములు

ఋగ్వేదం

ఋగ్వేదాన్ని దర్శించినప్పుడు ఆ వేదాన్ని ఒక రూపుతో దర్శించారు కనుక ఋగ్వేద పురుష అని వ్యవహరిస్తారు.
ఋగ్వేదః శ్వేత వర్ణస్యాత్ ద్విభుజో రాసబాననః |
అక్షమాలాదరః సౌమ్యః ప్రీతో వ్యాఖ్యా కృతో ద్యమః ||






ఋగ్వేద పురుషుడు తెలుపు రంగులో ఉంటాడట. గాడిద ముఖం కలిగి ఉంటాడట. చేతిలో మాల ధరించి ఉంటాడట. ప్రశాంతంగా కనిపిస్తూ వేదాన్ని అందించాడట.
సంహితలు ఎనిమిది ఆష్టకములుగా ఉంటుంది. ఒక్కో అష్టకం ఎనిమిది అధ్యాయాలుగా ఉంటుంది. మొత్తం 1028 సూక్తులుగా ఉంటుంది. 10552 ఋక్కులు (మంత్రాలు) ఉంటాయి. మొత్తం 397265 అక్షరాలు ఉంటాయి.
ఈ మొత్తం 21 శాఖలుగా విభజించారు. సంహితలని ఆ శిష్యుల పేర్ల రూపుతో వ్యాస, పైల, ఇంద్రప్రమాతి, మాండుకేయ, సత్య స్రవస్, సత్య హిత మరియూ సత్యశ్రీగా విభజించారు. ఒక్క సత్యశ్రీ శాఖను తీసుకుంటే అది వారి శిష్యులైన సాఖల, సాఖపూణి మరియూ భాష్కల అని మూడుగా విభాగం అయ్యింది. సాఖల మరో ఐదు భాగాలుగా, భాష్కల నాలుగు భాగాలుగా విభాగం అయ్యింది.
ఋగ్వేదంలో ఉపవేదంగా ఆయుర్వేదం ఉంటుంది.
బ్రాహ్మణాలు నాలుగు భాగాలుగా, అవి పైంగ, బహ్-వ్రిచ, ఆశ్వలాయణ, గాలవ బ్రాహ్మణాలుగా విభాగం అయ్యాయి.
ఆరణ్యకాలలో ఉపనిషత్తులు ఉంటాయి. అవి నిర్వాణ, ఐతరేయ, బహ్-వ్రిచ, సౌభాగ్య, కౌశీతకి, ముద్గల, నాదబిందు, త్రిపుర, ఆత్మ ప్రభోద మరియూ అక్షరమాలిక అని పది ఉపనిషత్తులుగా ఉంటాయి.

యజుర్వేదం

యజుర్వేద పురుషుడిని ఇలా దర్శించారు.

అజస్యపీత వర్ణస్యాత్ యజుర్వేదో అక్షసూత్ర ద్రుత్ |
వామే కులిసపాణిస్తూ భూతిదో మంగళప్రదః ||






మేక ముఖం కలిగి పసుపు రంగులో ఉంటాడు. ఎడమ చేతిలో కర్ర పట్టుకొని ఉంటాడు. సంపదలని, శుభముని ఇచ్చేలా ఉంటాడు.
యజుర్వేదం రెండు భాగాలు ఉంటుంది. శుక్ల యజుర్వేదం మరియూ కృష్ణ యజుర్వేదం. శుక్ల యజుర్వేదం  కాన్వ మరియూ మాద్యందిన అనే శాఖలుగా ఉంటుంది. కృష్ణ యజుర్వేదం తైత్తిరీయ, మైత్రాయణి, కఠ మరియూ కపిస్తల అనే శాఖలుగా ఉంటుంది.
కాన్వ శాఖ 40 అధ్యాయాలు, 328 అనువాకాలు, 2086 మంత్రాలుగా ఉంటుంది. మాద్యందిన 40 అధ్యాయాలు, 303 అనువాకాలు, 1975 మంత్ర ఖండాలు, 3988 మంత్రాలు, 29626 పదాలు, 88875 అక్షరాలుగా ఉంటుంది. ఇంత లెక్కతో జాగ్రత్తగా బద్రపరిచారు. తైత్తిరీయ శాఖ 7 ఖాండాలు, 44 ప్రపాతకాలు, 635 అనువాకాలుగా ఉంటుంది. మైత్రాయణి శాఖ 4 ఖాండాలు, 54 ప్రపాతకాలు, 2144 మంత్రాలుగా ఉంటుంది. కఠ శాఖ 5 ఖాండాలు, 40 ఆధ్యాయాలు, 13 అనువాచకాలు, 843 అనువాకాలు మరియూ 3091 మంత్రాలుగా ఉంటుంది.
బ్రహ్మణాలు చరక, కాతక, తుంబుర, జాబల, కన్కతి, స్వేతాస్వేతర, మైత్రాయణి, ఖాందికేయ, హారిద్ర, ఆహ్వరాక, ఔకేయ మరియూ చాగలేయ అనే శాఖలుగా ఉంటుంది.
శుక్ల యజుర్వేద ఉపనిషత్తులు ఈసావాస్య, బృహదారణ్యక, జాబాల, సుభాల మొదలైనవి.
కృష్ణ యజుర్వేద ఉపనిషత్తులు కఠ, తైత్తిరీయ, స్వేతాస్వేతర మొదలైనవి.

సామ వేదం


సామ వేద పురుషుడిని ఇలా దర్శించారు.

నీలోత్పలధలశ్యామోః సామవేదో హయాననః |
అక్షమాలాఅన్వితోదక్షే వామే కుంభదారణ స్మృతః ||






కృష్ణుడి వంటి నీలి రంగులో, గుఱ్ఱపు ముఖం కలిగి, ఒక చేతిలో కొరడా కలిగి, ఎడమ చేతిలో కుండ కలిగి ఉంటాడు.
సామవేదం మొత్తం 1065 శాఖలుగా ఉంటుంది. అందులో ముఖ్యమైనవి తొమ్మిది. రాణాయణ, సాట్యాయన, సార్యముగ్ర, కల్వల, మహా కల్వల, లాంగల, కౌతుమీయ, గౌతమీయ, జైమినీయ అని ముఖ్య శాఖలు. అందులో రాణాయణ, కౌతుమీయ మరియూ జైమినీయ అనేవి మాత్రం ఉన్నాయి. మిగతా శాఖలు లభించడం లేదు.
సామవేద సంహితలు పూర్వర్చిక, ఉత్తరార్చిక మరియూ ఆరణ్యకాలుగా ఉంటుంది. పూర్వర్చిక 6 ప్రాతకాలు, 59 దషతీలు, 585 మంత్రాలుగా ఉంటుంది. ఉత్తరార్చిక 9 ప్రాతకాలు, 120 దషతీలు, 1220 మంత్రాలుగా ఉంటుంది. ఆరణ్యకాలు 55 మంత్రాలుగా ఉంటుంది.
బ్రాహ్మణాలు భాల్లవి, కాలబవి, రౌరుకి, సాట్యాయన అని నాలుగు భాగాలుగా ఉంటుంది.
ఉపనిషత్తులు చాందోగ్య, కేన, మైత్రాయణి, తల్వకారీయ మరియూ మహోపనిషత్తులుగా ఉంది.

ఆదర్వణ వేదం

ఆదర్వణ వేద పురుషుడిని ఇలా దర్శించారు.


 ఆధర్వణాభిదో వేదో ధవళో మర్కటాననః |
అక్షమాలాన్వితో వామే దక్షే కుంభదరః స్మృతః ||




తెలుపు రంగులో, కోతి ముఖం కలిగి, కుడి చేతిలో మాల ధరించి, కుడిచేతిలో కుండ కలిగి ఉంటాడు.
ఆదర్వణ వేదం 15 శాఖలు, 20 ఖండాలు, 736 సూక్తాలుగా ఉంటుంది. పైప్పాలద, సౌనక అనే శాఖలు మాత్రం లభిస్తున్నాయి.
శిల్పవేదం ఉపవేదంగా ఉంది.
బ్రాహ్మణాలలో గోపత బ్రాహ్మణం ఉంటుంది.
ఆరణ్యకాలు ఏవీ లభించడం లేదు, మొత్తం 31 ఉపనిషత్తులలో ప్రస్న, ముండక, మాండుక్య అనేవి లభిస్తున్నాయి. 

వేదాంగాలు- వివరణ గ్రంథాలు


మనం ఈనాడు పాశ్చాత్యులు చూపిస్తున్న విజ్ఞానామే గొప్ప అని భావిస్తున్నాం, కానీ మన వేదాలలో ఎంతో విజ్ఞానం ఉందని మరచి ప్రవర్తిస్తున్నాం. వేదాలు ఏమిటో తెలుసుకోవాలని ఈ నాడు పాశ్చాత్యులు ఉత్సాహం చూపిస్తున్నారు, కానీ దురదృష్టకరం మనం వాటిని ఆదరించడం లేదు. దాన్ని కొంతనైన అర్థచేసుకొనే ప్రయత్నం చేద్దాం.
వేదాలు ముఖ్యంగా ఋగ్,యజుస్,సామ మరియూ ఆదర్వణ విభాగాలుగా ఉంది. ఇంత వేదరాశి సహజమైన శబ్దాలు. అందులో ఎంతో జ్ఞానం నిగూఢమై ఉంది. మరి ఆ అర్థాన్ని ఎట్లా తెలుసుకోవడం ?  వేదాన్ని అర్థం చేసుకోవడానికి మన ఋషులు వాటికి ఎన్నో వివరణ గ్రంథాలను ఇచ్చారు. వేద రాశి యొక్క అర్థ నిర్ణయాని కొరకు. వీటినే వేదాంగాలు అని అంటారు. అవి ఆరు.

1. శిక్షా

వేద శబ్దాల మూలాలు, ధాతువులని బట్టి ఆయా శబ్దాల  ఉచ్చారణ, స్వరములని చెప్పేది. వేదాన్ని ఎట్లా పలకాలో తెలుపుతుంది.

2. వ్యాకరణం

కొన్ని శబ్దాలు ఒక్కో చోట ఒక్కోలా ఉచ్చరించాల్సి ఉంటుంది, అవి ఎట్లాలో చెప్పేది వ్యాకరణం. ఎన్నో ధాతువుల నుండి అర్థాన్ని చెబుతాయి. ఉదాహరణ మానవ అనే పదం. మను అనే మహర్షి యొక్క సంతతి కనక మానవ అయ్యింది.

3. కల్పకం

వేద యజ్ఞంకోసం చేయాల్సిన యాగ శాల, వేదిక ఎట్లా ఉండాలి అనే విషయాలను తెలిపేది కల్పకం.

4. నిరుక్తం

పదాలు ఎట్లా తయారు అయ్యాయో తెలుపుతుంది. మనుష్య అనే పేరు ఎట్లా వచ్చింది అంటే 'మత్వా కర్మాణి సీవ్యతి'. లోకానికి ఏది కావాలో ముందే ఆలోచించి చేసే వాడు కనక మనిషి అని పేరు.

5. ఛందస్సు

ఛందస్సు అనేది వేద మంత్రాలలోని అక్షరాలను కొలిచేది, శబ్దాల అర్థాలను వివరిస్తుంది. విష్ణుసహస్రనామాలు ఉండేవి అనిష్టుప్ ఛందస్సు, అంటే శ్లోకంలో 32 అక్షరాలు ఉంటాయి. నాలుగు భాగాలు చేస్తే ఒక్కో భాగానికి 8 అక్షరాలు ఉంటాయి. గాయత్రి మంత్రానికి పేరు ఛందస్సుతో ఏర్పడింది. గాయత్రి అనేది ఛందస్సు. కొందరు గాయత్రి మంత్రం అనగానే ఒక స్త్రీమూర్తిని బొమ్మగా వేసి చూపిస్తారు, కాని అది తప్పు. గాయత్రి మంత్రం ప్రతిపాదించే దేవత నారాయణుడు. అందుకే సంధ్యావందనం చేసేప్పుడు సూర్యమండలం మధ్యవర్తిగా ఉండి నడిపేవాడు నన్నూ ప్రేరేపించుగాక అని కోరుతారు. నారాయణుడు ఆ మంత్రం యొక్క దేవత. ఉత్పలమాల, చంపకమాల అనేవి తెలుగులో ఛందస్సు. ఆ పదాలు స్త్రీలింగ శబ్దాలు, అట్లానే గాయత్రి ఛందస్సు కూడా.

6. జ్యోతిషం

మనం ఆచరించాల్సిన పనులు ఎప్పుడు, ఏమి, అట్లా చేయాలో తెలిపేది. చంద్రుడిని బట్టి, సూర్యుడిని బట్టి, ఋతువులని బట్టి కాలాన్ని చెబుతుంది.
పై ఆరిటినే షడంగాలు అని చెబుతారు. ఇవి వేదం యొక్క అర్థాన్ని నిర్ణయించేవి.

(ఇంకా వుంది...)

Thursday, August 2, 2012

సనాతన వైదిక ధర్మం - 4

మన వాఙ్మయాల గొప్పతనం గుర్తించాలి


పాశ్చాత్యులు మన దేశంపై దాడి చేసినప్పుడు వారికేం పెద్ద సంస్కృతి అంటూ లేదు. ఇక్కడివారి బట్ట కట్టే విధానాన్ని, ఆహారం తయారుచేసుకొనే విధానాన్ని, మన జీవన విధానాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అలాంటి స్థితిలో అడుగుపెట్టి ఈనాడు మనకు వారే అన్ని నేర్పినట్టు వారు చూపిస్తున్నారు. మనం వారు చెప్పినది ఒప్పుకుంటూ, వారి మోచేతి గుండా కారే నీటిని త్రాగడానికి అలవాటు పడ్డ బానిస ప్రవృత్తి మన నరనరాలలో నిండుకొని ఉంది ఈ నాటికీ. ఇది జరిగి మూడు నాలుగు వందల సంవత్సరాలు కూడా గడవలేదు కానీ కొన్ని లక్షల సంవత్సరాల చరిత్రని మరచి వారు చెప్పిందే చరిత్ర అని నమ్ముతూ వస్తున్నాం. మనది సిందూ నాగరికత అని చెప్పి, మనకంటూ ఉన్న పేరుని, సంస్కృతిని మరచి వారు చెప్పినదే పాట అన్నట్టు బ్రతుకుతున్నాం.

మనమేమిటి అనేది మనం మరచినా, మన పరంపర ఏమిటి అనేది చెప్పే మన గ్రంథాలు ఉన్నాయి. అది మన అదృష్టం. పాశ్చాత్యులు ఎన్నో గ్రంథాలను నామ రూపాలు లేకుండా కాల్చిపాడేసినా ఇంకా మనకు ఎన్నో గ్రంథాలు మనవరకు అందాయి. ఆ లభించిన గ్రంథాలు చెబుతున్నాయి, విమానాలని తయారుచేయడంలో కానీ, రకరకాల విజ్ఞాన విషయాలని కలిగి ఉన్న ఈ దేశం వెనకపడ్డ దేశం కానే కాదు అని.  ఈ నాడు ఇంత విజ్ఞానం కలిగి ఉన్నా చర్మంలోని పొరలని రెండు మూడు పొరలుగానే విడదీయగల్గుతున్నారు. చరకుడు అనే మన శాస్త్రజ్ఞుడికి ఏనాడో చర్మాన్ని ఏడు పొరలుగా విడదీసేంత శస్త్ర చికిత్స నైపుణ్యం ఉందేది. ఈనాడు ఉండే భూగోళ ఆకృతిని అంత స్పష్టంగా చెప్పగలిగాయి మన శాస్త్రాలు అంటే ఆనాడు ఎంత విజ్ఞానం ఉండేదో ఊహించవచ్చు.

అయితే ఈ దేశం మీద దాడి చేసిన వారు ఇక్కడి గంథాలను నాశనం చేసి, మన విజ్ఞానాన్ని దొంగలించి, మన వైజ్ఞానికులని ఊచకోత కోసి, సంపదలని దోచుకొని పోయి, ఇక్కడివారిని బానిసలుగా మార్చడం చేత మనం మనవద్ద అలాంటి విజ్ఞానం ఉండేది అని చెప్పుకొనే అవకాశం లేని స్థితి ఏర్పడింది. మరి అంత విజ్ఞానం ఉంటే ఏమైంది, ఈనాడు వారు చూపించిందే మనం అనుభవిస్తున్నాం కదా అని అనిపిస్తుంది. ఒకసారి మన విజ్ఞానాన్ని ఒక తరంలో నాశనం చేస్తే, ఎన్ని వందల తరాలు కావాలో తిరిగి సంపాదించుకోవడానికి. నాశనం చేయడానికి ఎంతో కాలం పట్టదు. మన విజ్ఞానాన్ని నాశనం చేయడమే కాదు, ఆ వ్యక్తులని కూడా ఊచకోత కోసిన సంఘటనలు మన దేశ చరిత్రలో ఎన్నో ఉన్నాయి.

ఈ నాడు మనం చూస్తున్న సైన్స్ పాశ్చాత్యులు మనపై దాడి చేసిన తరువాతే ఎందుకు అభివృద్ది చెందింది ? అంత విజ్ఞానమే వారికి ఉంటే మరి అంతకు ముందు ఏమైంది..? ఇక్కడినుండి  విజ్ఞానాన్ని, సంపదలని దోచుకొని వారు తయారుచేసినట్లు చూపిస్తున్నారు. సంస్కృతంలో ఉన్న భరద్వాజ విమాన శాస్త్రాన్ని పారిస్ లో లభిస్తే మన వాళ్ళు ఇప్పుడు అచ్చు వేయించారు. అట్లా మన విజ్ఞానం అనేది దోచుకొని వెళ్ళారు అని చెప్పడానికి ఒక ఉదాహరణ.
మన వద్ద దొంగిలించి ప్రపంచానికి మేం తెలియజేసాం అని చెబుతున్నారు. మన దేశంలో తయారయ్యే బియ్యానికి పేటేంట్ రైట్స్ వారికి ఉన్నాయి. బాసుమతి బియ్యానికి పేటెంట్ వారివద్ద ఉంది ఈ నాడు. రేపు ఒకనాడు మనకు అన్నం ఎట్లా తినాలో మేమే తెలిపాం అని చెబుతారు. మనం ఓహో అని నమ్ముతాం. మనం కాదు అన్నా, మన మాట చెల్లు బాటు కాదు. ఆ అన్నాన్ని ఎట్లా వండుకు తినాలి అని సంస్కారం తెలియని వారికి ఆ బియ్యం పై పేటెంట్స్ అవసరమా..? కోతి నుండి మనిషి పుట్టాడు, ఒకనాడు పచ్చి మాంసం తిన్నాడు, క్రమేపి అగ్గిని కనిపెట్టి వండుకు తిన్నాడు అని చెప్పేవారు వాళ్ళు. ఆ అన్నంతో పులిహోర, పొంగలి వంటి ఎన్నో రకరకాల రుచికరమైన పదార్థాలు, బియ్యపు నూకతో, బియ్యపు పిండితో ఎన్నో రకాల పదార్థాలు చెయ్యడం మనకు కొన్ని వేల సంవత్సరాల నుండే తెలిసిన వాళ్ళం మనం. మన ఆలయాల్లో దేవునికి ఆరాధన క్రమం తెలిపేవి, నైవేద్యం ఎట్లా పెట్టాలో తెలియజేసే వాటిని మనం ఆగమ సంహితలు అంటారు. అందులో మనం చేసే వంటలు ఎట్లా చేయాలో తెలుపుతాయి. అందుకే మన ఆలయాల్లో ప్రసాదాలు రుచి గా ఉంటాయి అవి ఆగమ పద్దతుల ద్వారా చేసేవి కాబట్టి. ఇదీ మన వాఙ్మయాల గొప్పతనం.
ఇంకా అదృష్టం కొద్ది ఉనికిని కోల్పోలేదు. మనలో ఇంకా ఆశావాద ప్రవృత్తి ఉంది. అన్ని రంగాల్లో మన నైపుణ్యాన్ని అందరూ గుర్తించే స్థితిలో ఉన్నాం. మనం అభివృద్ది మార్గంలో ఉన్నాం అనే విషయంలో ఏం సందేహం లేదు. మన సంస్కృతి, మన శాస్త్రాల గొప్పతనాన్ని గుర్తిస్తే మనకు వాటిపై విశ్వాసం ఏర్పడుతుంది.

వేద విభజన - రక్షణ వ్యవస్థ


వేదాల్లో చాలా శాఖలు ఉన్నాయి. వాటి సంఖ్యలు 1131 శాఖలు అని చెబుతారు. స్థూలంగా వాటిని నాలుగు భాగాలుగా వేదవ్యాస భగవానుడు ఏర్పాటుచేసాడు. అంతకుముందు ఆయా లక్షణాలతో వేరే వేరే భాగాలుగా ఉండేవి. అందులో ఒక లక్షణమైన వాటిని ఋక్కులని, ఒక లక్షణం కల్గిన వాటిని మంత్రభాగం క్రింద యజస్సు అని, ఒక లక్షణం కల్గిన వాటిని గానాత్మకంగా సామం అని, మరికొన్నింటిని ఆదర్వణం అని ఇలా పేర్లతో ఆయా ఒక్కో భాగాన్ని ఒక్కో శిష్యుల ద్వారా పదిలపర్చడానికి వారికి అందించి, ఇక వారి ప్రశిష్యుల ద్వారా మరిన్ని ఉప శాఖలుగా విభజించి వాటి రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసినట్టుగా మన శ్రీమత్ భాగవతాది గ్రంథాలు తెలియజేస్తున్నాయి.
మొదట ఈ నాలుగు వేద రాశులని ఒక్కో వ్యక్తి అధ్యయనం చేసే స్థితి ఉండేదేమో, కానీ వేదవ్యాసుని సమయానికే కొంత సందేహం ఏర్పడింది. వేద వ్యాసుని కాలంలో కౌరవుల ప్రవృత్తి గుర్తుకు చేసుకుంటే తెలుస్తుంది. ద్రౌపతి సామాన్యురాలు కాదు, ఒక మహారాణి, అట్లా వారు ఆమెని సభా మధ్యంలోకి తీసుకొచ్చి అవమానం చేయడం అనేది ఎంత దిగజారుడు స్థితి అనేది అర్థం అవుతుంది.  రాన్నున్న కాలంలో ఈ మాత్రం నిలబెట్టుకొనే సామర్థ్యం మనుష్యులలో ఉండకపోవచ్చుననేమో ఆయన తన శిష్యుల ద్వారా వాటిని పరిరక్షించే వ్యవస్త ఏర్పాటు చేసి ఉంటాడు. సూర్య ఉదయం చాలా మెల్లగా ఉంటుంది, అదే సూర్య అస్తమయం చాలా వేగంగా ఉంటుంది. అలాగే మనుష్యులలో ధార్మిక ప్రవృత్తి అనేది ఎంత వేగంగా దిగజారుతుందో మనకు తెలుస్తుంది. ఆధునిక వైజ్ఞానిక ప్రవృత్తులు సమాజాన్ని ఎంత త్వరగా దిగజార్చాయి అనేది కూడా గమనించవచ్చు. ఆధునిక వైజ్ఞాన శాస్త్రం పెరిగింది 16 వ శతాబ్దం నుండే, అయితే దాని వల్ల మంచి జరిగింది కానీ ఎన్నో వేల సంవత్సరాల నుండి వస్తున్న ప్రకృతి చిన్నా భిన్నం అవడంకూడా అప్పటి నుండే మొదలైంది. అయితే వ్యవస్త చిన్నా భిన్నం అవడం ఎంత త్వరగా జరుగునో మనకు దీన్ని గమనిస్తే తెలుస్తుంది.


అయితే ఈ వేదం అంతా ఒకే రాశి క్రింద ఉండేది, ఒక వ్యక్తి అంతటినీ అధ్యయనం చేయగలిగే వారని మనకు రామాయణంలో తెలుస్తుంది. రాముడు మొదటిసారిగా హనుమను కలిసినప్పుడు, హనుమ రాముణ్ణి కొన్ని ప్రశ్నలు వేసాడు, ఇది పది పదిహేను శ్లోకాలుగా రామాయణంలో ఉంది. ఆ ప్రశ్నలకు బదులుగా రాముడు లక్ష్మణ స్వామితో హనుమ గూర్చి ఇలా అన్నాడు "నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణః నా సామవేద విజుషః శక్యమేవం ప్రభాశితుం" ఈయన మాట్లాడే మాటలు ఎంత బాగున్నాయి చూసావా, చంపివేద్దాం అని వచ్చినవాడికి కూడా ఈయన మాటలు వింటే కత్తి దించివేస్తాడు, ఆ సామర్థ్యం ఈయన మాటల్లో కనిపిస్తుంది. ఋగ్వేదపు, యజుర్వేదపు, సామవేదపు నియంత్రణ కచ్చిత్తంగా కనిపిస్తుంది. అంటే ఆవేదాధ్యయనం చేసినవ్యక్తిలో ఏర్పడే పూర్ణత ఈయనలో కనిపిస్తుంది. ఆంటే ఆ కాలంలో మొత్తం వేద రాశిని నేర్చేసామర్థ్యం ఉండేదని మనకు కనిపిస్తుంది.

అయితే ఆ యుగాలు గడిచి ఎన్నో మార్పులు ఏర్పడ్డాయి అందుకే వేదవ్యాసుడు ఆ మొత్తం వేద రాశిని కొన్ని శాఖలుగా విభజించవలసి వచ్చింది. అవి మొత్తం 1131 శాఖలు అని చెబుతారు. అందులో సామవేదానికే 1000 శాఖలు, యజుర్వేదానికి 101 శాఖలు, అదర్వవేదానికి 9 శాఖలు, ఋగ్వేదానికి 21 శాఖ అని అంటారు. అలా శాఖలుగా చేసి వేద విజ్ఞాన పరిరక్షణ చేసారు. మన కాలం దాకా వచ్చే సరికి అందులో కేవలం 11 శాఖలు మాత్రమే కనిపిస్తున్నాయి. 1000 శాఖలు కల సామవేదంలో కేవలం 4 శాఖలు మాత్రమే కనిపిస్తున్నాయి, యజుర్వేదంలో 101 కి బదులు 4 శాఖలు, ఇక అదర్వవేదంలో 2, ఋగ్వేదంలో 1 శాఖ మాత్రమే ఈనాడు మనకు కనిపిస్తున్నాయి. మిగతా శాఖల పేర్లు మాత్రం తెలుస్తున్నాయి కాని ఆ శాఖలు ఏమిటో ఎవ్వరికీ తెలియదు.

అయితే వేదం అనేది మన ధర్మ శాస్త్రాలలో, ఇతిహాసాలలో, పురాణాది గ్రంథాలలో విస్తరించి ఉంది. వాటి ద్వారా మనం వేద సారాన్ని దర్శించే అవకాశం ఉంది. అట్లా మనం వేదం చెప్పిన విషయాలను తెలుసుకుంటూ, వాటిని ఆచరిస్తూ ప్రయాణిస్తే మన జన్మకి సార్థకత ఏర్పడుతుంది.

వేదం - నాలుగు భాగాలు


వేదాలు మంత్రాల రూపంలో ఉంటాయి. 'మన్' ఎవరైతే వాటిని మననం చేస్తారో 'త్ర' వారిని కాపాడేవి మంత్రాలు అని అంటారు. ఆ మంత్రాల లక్షణాలను బట్టి ఒక్కో పేరుతో వ్యవహరిస్తారు.
వేదం అంటే విజ్ఞాన శాస్త్రం. మన చుట్టూ ఉన్న ప్రకృతి లో ఎన్నో శక్తి విశేషాలు ఉన్నాయి. మనం బ్రతకాలంటే నీరు కావాలి, గాలి కావాలి, నిప్పు కావాలి, ఇలా ఎన్నో ఉంటే తప్ప మన జీవనం గడవదు. మనం తినే ఆహారం తయారు అవ్వడానికి ఈ భూమి సహకరించాలి. మట్టి ఒక్కటి ఉంటే సరిపోదు, సూర్యరశ్మి సోకితేనే అవి పెరిగి మనకు ఆహారంగా కాగలవు. నీరు వర్ష రూపకంగా అందాలి. మనకు అనారోగ్యం చేస్తే కావల్సిన ఔషదాలు మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఉంటాయి. ప్రకృతి లోని శక్తి విశేషాల గురించి తెలిపే వాటిని ఋగ్వేదం అని అంటారు.
ఆ శక్తి విశేషాలను పొందాలంటే మనం కొంత చేయాల్సి ఉంటుంది. ఒక చెట్టుని పెంచాలంటే ముందు నేలని తవ్వాలి, శుద్ది చేయాలి, ఒక విత్తనాన్ని నానబెట్టాలి, అది మొలకెత్తాలి, అప్పుడు మొక్కను నాటి పెంచుతాం. ఏది ముందు చేయాలో, ఏది తరువాత చేయాలో అంటూ ఒక పద్దతి ఉంటుంది. ఇలా మనం ఫలితాన్ని పొందాలంటే ఏమేమి ఎట్లా చేయాలో నియమాలని తెలిపేది యజుర్వేదం.
మనం ఏదైనా కోరినప్పుడు మన చుట్టూ ఉన్న శక్తి విశేషాలని వాడుకుంటాం. అవి మనకు సహకరించాలి అంటే మనం వాటిని ఎట్లా పూజించాలి. వాటిని మెప్పించడానికి గానాత్మకంగా ఉన్న వాటిని సామ వేదం అని అంటారు.
  
ఋగ్వేదంలో చెప్పే విషయాలు ఎక్కువగా పరలోకానికి సంబంధించినవి ఉంటాయి. మనకు ఇహలోకం మరియూ పరలోకం రెండూ ప్రధానమే. ఈ లోకంలో  ఉండగా కొన్ని ఫలితాలు మనం కోరుకుంటాం. అట్లా మనం ఆచరించాల్సిన నియమాలు, పద్దతుల గురించి చెప్పే వాటిని ఆదర్వణ వేదం అని అంటారు.
అయితే అన్ని వేదాలను కలిపి చూస్తే అవి మనం ఆచరించాల్సిన ధర్మం గురించి తెలుపుతాయి. ఎట్లా ఆచరించాలి ? అంటే క్రమశిక్షణ తో ఆచరించాలి. మనకు వెంటనే ఫలితం రాకుంటే ఏం చేయాలి ? ఆపకూడదు, మన కృషి చేస్తూనే ఉండాలి. ఫలితం వస్తుందా ? అంటే తప్పక వస్తుంది. మనం అలవర్చుకోవాల్సింది ఈ లోకంపై , పరలోకం పై నమ్మకం మరియూ మనపై, భగవంతునిపై విశ్వాసం. వేదాలు మన ఆచరణ ఎట్లా ఉండాలో తెలుపుతాయి, దాన్నే ధర్మం అని అంటారు.

(ఇంకా ఉంది)

Sunday, July 29, 2012

సనాతన వైదిక ధర్మం -3

సృష్టి అంతా వేద శబ్దంచే సృజించబడినది

 
వేదం అనేది విజ్ఞాన శాస్త్రం. కొంత తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.  మను అనే మహర్షి వేదాన్ని గురించి ఇలా చెప్పాడు.  "వేద శబ్దేభ్య ఏవాతౌ దేవా దీనం చకార సహ"

సహ- ఈ జగత్తుని సృజించినవాడెవడో జగత్ కారణమైనటువంటి వాడొకడున్నాడు. ఈ విషయం అందరూ అగీకరించాల్సి ఉంటుంది. ఎందుకంటే "For Every Effect there must be some Cause". మనం ఇప్పుడు చూస్తున్న ఈ జగత్తు అంతటికీ ఒక కారణం అనేది ఉండాల్సిందే. దాన్నే మనం కారణ తత్వం అందాం. ఈ జగత్తులో ఎన్నో విషయాలు చూస్తున్నాం, ఇవన్నీ ఒకదాని తో ఒకటి ముడి పడి ఉన్నాయి.

ఆ కారణ తత్వం వీటన్నింటినీ నడుపుతుంది. మన పెద్దలు "కారణంతు ధ్యేయః" ఆ కారణాన్ని తత్వాన్ని తెలుసుకోండి అని చెబుతారు. ఆ తత్వం ఎక్కడో ఒక చోట ఉంటుంది అని చెప్పనవసరం లేదు. ఎందు కంటే మనం చూసే ప్రతి అణువణువు ఎంత క్రమబద్దమై ఉంటుంది కావున అది అంతటా వ్యాపించియే ఉంటుంది. ఇంతటినీ తయారు చేసిన ఆ కారణ తత్వం చాలా శక్తివంతమైనది, అన్నింటినీ నియంత్రించ గలదై ఉండాల్సిందే లేకుంటే దీన్నంతా ఆధీనంలో పెట్టుకోవడం అంత సులువుకాదు.  నియంత్రించడం అనేది పురుష స్వభావం అయితే ఇక దయ, క్షమ, ఓరిమి, జాలి ఇవన్నీ స్త్రీ స్వభావం అని అనుకోవచ్చు. అందుకే ఆయనలోని ఈ నియంత్రించే స్వభావన్ని బట్టి మను అనే మహర్షి "సహ" అంటే అతడు అని వ్యవహరిస్తాడు.

మరి కేవలం నియంత్రించే తత్వమే ఆ జగత్ కారణ తత్వానికి ఉంటే ప్రమాదం కదా, ఎవ్వరూ దాని దరికి చేరటానికి ఇష్ట పడరు. అందుకే ఆ కారణ తత్వం మొత్తం దయచే ఆక్రమించబడి నిరంతరం ఉంటుంది. వేద భాగమైన మంత్ర పుష్పాల్లో ఈ విషయం చెప్పబడి ఉంది.  "నీలతో యదమధ్యస్తాః విధ్యుల్లేఖేవ భాస్వరః" దయా అనే గుణం ఆయనలో ఒక మేఘాన్ని ఆక్రమించిన మెరుపు తీగవలె, ఆ తత్వాన్ని కప్పబడి ఉంటుంది అని తెలుపుతుంది. అయితే దయ అనేది స్త్రీ స్వభావం అవటంచే స్త్రీ రూపంలో భావన చేస్తుంటారు.  అయితే ఈ నియంతృత్వం లేక శాసితృత్వం మరియూ దయ లో ఏ ఒక్కటీ లేక పోతే పని చెయ్యదు. కేవలం శాసితృత్వం ఉన్నా సరిపోదు, కేవలం దయ ఉన్నా సరిపోదు. అందుకే మన పెద్దలు ఇవి రెండు వేరువేరుగా ఉండవయా, దయ కల్గిన నియంత్రణ ఉన్న వాడే ఈ జగత్ కారణ తత్వం అని చెబుతారు.  వాడు అని చెబుతున్నాం ఎందుకంటే ఆ తత్వం చేతనుడై ఉండాలి, మనకు తెలివి ఉంది మనలాంటి వారిని నియంత్రించే వాడికీ తెలివి ఉంటే తప్ప నియంత్రించడం కుదరదు. అందుకే చేతనుడై ఉండాలి ఆ తత్వం. దయ కల్గి నియంత్రించగలిగేదే ఆ తత్వం "ఏకమేవ అద్వితీయం"అని చాందోగ్య అనే శృతి తెలియజేస్తుంది. ఈ దయ నియంతృత్వం రెంటినీ కల్పి మనం శ్రీమన్నారాయణుడు అని చెబుతాం, అంటే 'శ్రీ' కల్గిన 'నారాయణుడు' అని అర్థం.

"చకార" ఈ జగత్తంతా చాతుర్వర్ణం. చాతుర్వర్ణం అంటే నాలుగు వర్ణాలుగా చెప్పటానికి యోగ్యత కల్గి ఉన్నది. నిలువుగా క్రమ పద్దతిలో నడిచే మానవులం ఒక వర్ణం అయితే, అడ్డంగా నడిచే పశువులూ, పక్షులూ మరియూ క్రిమి కీటాదులు తిర్యక్ అనే ఒక వర్ణం. ప్రాణం ఉన్నా లేకున్నా ఒక వద్ద కదలక పడి ఉండే చెట్లు, రాళ్ళు ఇవన్నీ స్థావరాలు ఇవి ఒక వర్ణం.  


ఇవన్నీ ఇలా పనిచేస్తున్నాయి అంటే వెనకాతల కొన్ని ధివ్యమైన శక్తివిశేషాలు మన బుద్దికి అందనివి కొన్ని ఉన్నాయి. ప్రమిద మనం తేగలం అందులో నెయ్యి పొయ్యగలం, ఇక దూదితో వత్తు పెట్టగలం, ఇక అగ్గిపెట్టెతో అగ్గి పుల్లని గీసి దీపం వెలిగిస్తున్నాం.  మరి అది దేనిలోంచి వచ్చింది అని చెప్పాలి. ఆ వచ్చే వేడి లేక కాంతి వీటన్నింటికన్నా విలక్షణమైన శక్తివిశేషం కలది. దానికి ధివ్యం లేక దేవ లేక సుర అని ఒక వర్ణం గా చెబుతారు. సుర నర తిర్యక్ స్తావర జాతులనే చాతుర్వర్ణం అని అంటారు.
సహ చకార - ఈ నాలుగు వర్ణాలను చేసిన వాడు, దేని చేత ?  "వేద శబ్దేభ్య ఏవ" వేద శబ్దాల చే చేసెను అని చెబుతుంది.
ఆ వేద శబ్దం కు అంత శక్తి ఉంది అన్న మాట. ఈ సృష్టి అంతా ఆ వేద శబ్దంచే సృజించబడి ఉంది.
 

వేదం నిత్యం


మానవ జాతికి మార్గ నిర్దేశ్యం చేయటానికి ఏర్పడ్డ వాంఙ్మయం వేద వాంఙ్మయం. ఆ వేద వాఙ్మయాన్ని మనం నిత్యం అంటాం. అంటే భూత,భవిష్యత్ మరియూ వర్తమాన ఈ మూడు కాలాల్లో ఒకేలా ఉండేది అని అర్థం. అది నిత్యం కనకనే దాన్ని ఏదో ఒకనాడు ఎవడో ఒకడు వ్రాసినవి కాదు. త్రేతాయుగంలో వాల్మీకి రామాయణాన్ని, ద్వాపర యుగంలో వేదవ్యాసుడు భారతాన్ని వ్రాసెను అని చెబుతాం. కానీ వేద వాఙ్మయాన్ని అలా వ్రాసినది అని చెప్పము.

మనం చూస్తున్న ఈ సృష్టి కొత్తగా ఏర్పడలా, అది జరుగుతూనే ఉంది. మొదట కృత యుగం, ఆ తరువాత త్రేతా యుగం, ద్వాపర యుగం, కలి యుగం, తిరిగి మళ్ళీ ఇక కృత,త్రేతా,ద్వాపర,కలి యుగం ఇలా చక్ర గతిన సాగుతూనే ఉంటుంది. ఇలాంటి 71 చతుర్యుగాలు, గడిస్తే ఒక మను సమయం అవుతుంది. ఒక్క చతుర్యుగం అంటే 43 లక్షల 20 వేల సంవత్సరాలు. ఆ తరువాత రెండో మను సమయం ప్రారంభం అవుతుంది. అలాంటి 14 మంది మనుల సమయం గడిస్తే బ్రహ్మగారికి ఒక రోజు,కల్పం లేక మహా ప్రళయం అంటారు. రోజు ఎంత రోజో బ్రహ్మ గారికి అంత రాత్రి కూడా ఉంటుంది. ఇక ఆయన రోజు ఇలా సాగుతూనే ఉంటుంది. అలాంటి బ్రహ్మకి ఇప్పుడు 50 యేండ్ల ఆయిస్సు గడిచిందని చెప్పవచ్చు.

మనలాంటి మనుష్యులు ఎప్పటి నుండో ఉన్నారు. పాశ్చాత్యులు చెప్పుతున్నట్టుగా ఈ మధ్య కాలంలో జరగలా. ప్రతి యుగంలో ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, బ్రహ్మ, రుద్రుడు, ప్రజాపతులు, ఋషులు ఉన్నారు. ఇవన్నీ పదవులు. వ్యాసుడు, పరాశరుడు ఇవన్నీ పదవులు. వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలు జీవించే వారు. సూర్యుడూ ఒక పదవి. ఈ విషయాలని పాశ్చాత్యులు అంగీకరించకున్నా ఇది వాస్తవం. వాళ్ళు భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది అని చెబుతారు కానీ అది ఏంటో ఇక పై చెప్పలేరు. మనం ఆ శక్తి విశేషాన్నే భూమాతా అంటాం. ఈ భూమిపై ఎన్నో చైతన్యం కల జీవరాశులు పుడుతున్నాయి, అందుకే మనం భూమికి చైతన్యం ఉంది అంటాం. అట్లా మనం చూస్తున్న ఈ సూర్యుడు పుట్టి 27 చతుర్యుగాలు అయ్యాయి. మనం ఉన్న చతుర్యుగంలో నాలుగో యుగంలో మనం ఉన్నాం. ఈ యుగం మొత్తం 4 లక్షల 32 వేల సంవత్సరాలు. ఇందులో ఇప్పటివరకు దాదాపు అయిదు వేల నూరు సంవత్సరాలు పైగా గడిచాయి.

వేదంలోని జ్ఞాన భాగమైన ఉపనిషత్తులలో మనకు కొందరి ఋషుల పేర్లు కనిపించవచ్చు. అవి వారు దర్శించిన వారు, వారు వ్రాసినవారు కాదు. ఈ మధ్య కాలంలో, అంటే ఈ కలియుగానికి ముందు ఉన్న సమయంలో ఉన్న ఋషులలా అని పించవచ్చు. ఉపనిషత్తులలో కనిపించే ఋషుల పేర్లను బట్టి మన వేదం పుట్టి ఇన్ని సంవత్సరాలు అని చెప్పకూడదు. వేదం నిత్యం. ప్రపంచం అంతా ఒకనాడు భరతవంశానికి చెందినదే
వేదాన్ని మన జాతి తన సంపదగా పరిరక్షించుకుంటూ వస్తుంది. మరి వేదాన్ని ఆచరించని పాశ్చాత్యుల విషయం ఏమి. మనం ఈనాడు చూస్తున్న ఇన్ని మతాలు ఎక్కడివి.
రామాయణ, భారత కాలాల్లో మతాలు అంటూ ఏమి లేవు. మతం అంటూ చెప్పాలంటే వైధిక మతం అని చెప్పాలి. కొందరు దాన్ని అచరించేవాళ్ళు. మరికొందరు పాటించనివారుండే వారు. అయితే ఆ వేదాలని ఆచరించే వారిలో కూడా ఎన్నో శాఖలు ఉండేవి. అయితే ఈ భూమిమీద ఉండే ప్రతి మానవుడూ భరత వంశంలోంచి వచ్చినవారే. ఈ విషయం శ్రీమద్భాగవతం అయిదవ స్కందంలో  ఉంది. ఈ భూమి సుమారు 200 కోట్ల సంవత్సరాల క్రితం అంతా ఒకే భూ భాగం క్రింద ఉండేది ఒక నాడు. అందుకే సంధ్యా వందనాదుల్లో "చతుస్సాగర పర్యంతం" అని కనిపిస్తుంది మనకు. సుమారు 100 కోట్ల సంవత్సరాల క్రితం నుండి విడిపోవడం ప్రారంభించినది. సుమారు 50 లక్షల సంవత్సరాల కాలంగా మనం ఇప్పుడు చూస్తుండే ఖండంగా ఏర్పడ్డది. మన పురాణాలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. అందుకే మన పంచాంగల్లో సృష్టి ఆది 198 కోట్ల 58 లక్షల సంవత్సరాలు అని ఉంది. అమేరికాలోని చికాగో లో న్యాచురల్ సైన్స్ మ్యుజియంలో ఈ భూమి ఆకృతి 200 కోట్ల సంవత్సరాల క్రింద ఇలా ఉంది, 100 కోట్ల సంవత్సరాల క్రితం ఇలా అంటూ చూపిస్తూ 50 లక్ష్లల సంవత్సరాల క్రితంగా మనం ఇప్పుడు చూస్తున్న ప్రపంచ ఆకృతిని చూపించారు. వాటికి వారి వద్ద ఏ ఆధారాలు లేవు. మనం కచ్చితంగా 198 కోట్ల సంవత్సరాలు అని చెప్పగల్గుతున్నాం. మన వద్ద గ్రహించిన విషయాన్నే వాళ్ళు తిరిగి ప్రపంచానికి తెలియజేస్తున్నారు మేం చెబుతున్నాం అన్నట్టుగా. వాళ్ళు ఇంతవరకే చెబుతున్నారు. మన వద్ద ఇంతకు మించి ఆధారాలు కనిపిస్తున్నాయి. ఈ భూమిని ఖండాలుగా విభజించిన నాభి అనే చక్రవర్తి ఉన్నాడు. భరత వంశానికి చెందిన వాడు. తన సంతానానికోసం ఇలా విభజించి మొత్తం తన వంశాలవారినే అన్ని ఖండాల్లో విస్తరించాడు. వారే ఒక రథాన్ని ఉపయోగించి భూభాగాన్ని జరిపారు అని తెలుస్తోంది.

మనం ఇప్పుడు చూస్తున్న ఆస్ట్రేలియా ఖండం ఒకనాడు భారతదేశపు ఆగ్నేయ భాగంలో ఉండేదని ఇప్పటి శాస్త్రవేత్తలూ అంగీకరిస్తారు.ఆస్ట్రేలియా లో ఉత్తర భాగంలో ఉన్న అడవులూ, పక్షులూ మన తమిళనాటి అడవులను, పక్షులను పోలి ఉంటాయి. ఈ భూమి అలా క్రమేపీ జరుగుతూ ఉండటంచే అక్కడి పక్షులూ తమిళనాటికి వలస వస్తూ ఉంటాయి ఈ కాలం వరకు. అక్కడ ఉన్న ఒకప్పటి వాళ్ళు మన దేశ తమిళనాటి వారిలాగే ఉంటారు. వారి భాష కూడా అట్లానే ఉంటుంది. అక్కడ ఉండే బంగారు నిధుల కోసం బ్రిటీష్ వారు అక్కడ కాలు పెట్టి వారిని నామ రూపాలు లేకుండా చేసారు. ఇప్పుడు మనం అనుకుంటున్న అమేరికా కూడా అంతే. అక్కడి వారిని అనిచివేసి మేం అమెరికా అని ఈనాడు చెప్పుకుంటున్నారు. అమేరికాలోని మనం ఈ నాడు కాలిఫోర్నియా కూడా మనం మన పురాణాల్లో చూడవచ్చు. మనకు సగర చక్రవర్తి కుమారులు కపిల మహర్షిని వల్ల కాలి బూడిదైపోతే భగీరతుడు గంగను రప్పించాడు అని మనకు తెలుస్తుంది. అయితే ఆ కపిల మహర్షి ఉన్న అరణ్యమే మనం ఇప్పుడు చూస్తున్న కాలిఫోర్నియా. అదెలా అంటే, సంసృతంలో కొన్ని పదాలు వాటి స్వభావన్ని బట్టి అక్షరాలు మారుతాయి. హింస చేయునది సింహం అంటారు. ఇక్కడ 'స' 'హ' అక్షరాలు మారాయి.అలాగే కపిలారణ్య లో 'ప''ల' అక్షరాలు తిరగరాస్తే క-లి-ప అరణ్య, అలా కాలిఫోర్నియా అయ్యింది.
 
ఆ నాడు భరత వంశానికి చెందిన వాళ్ళు ఈ భూమిని విభజించాక బర్డ్ ఐ వ్యూ ఎట్లా ఉందో మన పురాణాల్లో ఉంది. అదెలా అంటే ఒక కుందేలు తన కాల్లపై లేచి ఎదురుగా ఉండే గడ్డి పొదకై చూస్తున్నట్లుగా ఉందని మన పురాణాల్లో ఉంది. మన పురాణాల లోనికి వారు వెళ్ళలేదు కనక ఈ విషయం పాశ్చాత్యులకి దొరకలేదు. లేకుంటే ఈ విశయాన్ని కూడా వాళ్ళే చెప్పే వాళ్ళు . ఈ చిత్రం మనం ప్రపంచ పటాన్ని తిప్పి చూస్తే కనిపిస్తుంది. మొత్తం ఆసియా, యూరోప్ ఖండాలు గడ్డిగా, అమేరికా కుందేలుగా కనిపిస్తుంది. దక్షిణ అమేరికా కుందేటి తల, ఇక ఉత్తర అమేరికా ఆ కుందేటి పొట్ట భాగం. అందుకే కాబోలు ప్రపంచాన్నంతా దోచుకుతిన్నారు!! అమేరికాలో ఉన్న విలువైన బంగారం అంతా ఒక నాడు ఇక్కడి నుండి దోచుకున్నదే. ఈ విషయం పక్కన పెడుదాం. ప్రపంచ పటాన్ని మేం తయారు చేసాం అని చెబుతున్న వాళ్ళకు ఇన్ని విషయాలు తెలియవు.
ఈ పాశ్చాత్యులు అలా చీలిన భూభాగాల్లో నివసించే వారిలో వేదాలని ఆచరించక బ్రతికేవాళ్ళలోకి చెంది ఉంటారు. భూమిని విభాగలుగా చీల్చిన వృషభుడి కుమారుడు భరతుడు. ఆయన తన నియంత్రణ కేవలం తన భూభాగానికే పరిమితం కాక పాలించేవాడు. అందరూ ఆయన పేరు చెప్పుకొనే వారట, అందుకే భారతీయ అనే పేరు ఈ భూమి అంతటా ఉండేది. ఈ భరతుడు స్వాయంభువ మన్వంతరానికి చెందినవాడు. అయితే ఈ నాడు మనం శకుంతల కుమారుడు భరతుడు, అతని ద్వారా భారతదేశం అని చెప్పుకుంటున్నాం. ఈ భరతుడు వైవత్సువ మన్వంతరానికి చెందినవాడు.
దురదృష్ట కరం ఈనాడు మనం వాటి విలువను తెలియక మన పురాణలపై, ఇతిహాసాలపై ఏమాత్రం గౌరవంలేనివాళ్ళలా తయారయ్యాం. ఇవి వాస్తవం అని గుర్తించాలి.

(ఇంకా ఉంది...)