Thursday, November 17, 2016

సనాతన వైదిక ధర్మం - 8

వేదాన్ని ఖండిస్తూ వచ్చిన నాస్తిక దర్శనాలు

ఎంతో కాలం నుండి వేదాన్ని ఆచరించేవారు ఉన్నట్లే, కొందరు వేదాన్ని అంగీకరించని వారూ ఉండేవారు. వారికి కలిగిన జ్ఞానం ద్వారా విషయాలను తెలిపేవారు. వారు తము గుర్తించిన జ్ఞానాన్ని తమ శిష్యులకు అందించేవారు. అట్లాంటి సంప్రదాయాలు కూడా వేద సంప్రదాయానికి సమాంతరంగా సాగుతూ వచ్చేవి. వాటినే దర్శనాలు అని అంటారు.
ఇవన్నీ ఎప్పటినుండో ఉన్నాయి. ఒక్కోక్కరి ఆలోచనా దోరణి. ఒక్కో కాలంలో కొందరు దర్శించి వెలికి తీసి చూపిస్తారు. అట్లాంటి దర్శనాలలో కొన్ని నాస్తిక దర్శనాలు కూడా ఉన్నాయి. సిద్దాంతాలలోని ఆలోచన ధార మంచికోసమే అయి ఉంటుంది, కానీ ఆచరణ ధారలో తప్పు జరిగే అవకాశం ఉంది. అప్పుడు ఆయా కాలాన్ని బట్టి ఒక్కో సిద్దాంతం వెలుగులోకి వస్తుంది.
 
నాస్తిక దర్శనాలు ఆరు. చారువాక, జైన మరియూ నాలుగు బౌద్ద దర్శనాలు.

చారువాక దర్శనం:


అట్లాంటి దర్శనాలలో మొదటిది చారువాక దర్శనం. 'చారు' అంటే అందమైన అని అర్థం. వాక్కు అంటే మాటలు. అంటే అందమైన మాటలు అని అర్థం. అవి చూడటానికి అందరికి నచ్చేలా ఉంటాయి. ఒక కాలంలో వేదాన్ని కేవలం కర్మ కాండల కోసమే వాడి, ప్రజలని మోసం చేసిన రోజులు కూడా ఉన్నాయి. వేదం అనేది లోక ప్రయోజనాల కోసం, కానీ కొందరు తమ తమ స్వార్థానికోసం వాడటం మొదలు పెట్టారు. ఇది మనం ఈనాడు కూడా అక్కడక్కడ చూడవచ్చు. భగవంతుని పేరిట ఆలయాల నియమాలను మార్చేవారు ఉన్నారు, ఆలయాలను వ్యాపార కేంద్రాలుగా మార్చేవారు ఉన్నారు. ఈ నాడు అందరి దేవతలను కలిపి దేవాలయాలు కడుతున్నారు, ఏనాడైనా మన పురాతన ఆలయాలు అట్లా కనిపిస్తాయా. వేదాలు ఉన్న దేవతలను వారిని ఆరాధించే పద్దతులు తెలుపుతాయి. ఎవరెవరి జ్ఞాన స్థాయిని బట్టి వారు కోరిన దేవతలని వారు ఆరాధించేవారు తప్ప స్వంత ప్రవృత్తులు చేర్చడం సబబు కాదు. మన పూర్వుల కంటే గొప్ప తెలివైన వారి మని ఈ నాటి వారి అభిప్రాయం. వారి జ్ఞానంలో ఎంత పాటి జ్ఞానం కలవారు వీరు ఒక్కసారి ఆలోచించాలి. అట్లా వైదిక సంప్రదాయాలు తప్పు దారిన నడిచే సమయంలో బృహస్పతి అనే ఋషి చారువాక దర్శనాన్ని అందించాడు. ఇది నాస్తిక దర్శనం. వైదిక ధర్మంలో మరణించినవారికి కర్మలు అనేవి చేస్తుంటారు. అట్లా చేస్తే అవి వారికి అందుతాయా అని వారికి తోచిన తర్కాన్ని చెబుతే, అది మనకు శ్రమ తగ్గించేవిలా ఉంటాయి. అట్లాంటి అందంగా అనిపించే మాటలే చారువాక అంటే. అయితే వారి దృష్టి వేదం వరకు ఉండదు, కేవలం ప్రత్యక్ష ప్రమాణం, అంటే కనిపించిన దాన్నే నమ్ముతారు. ఎప్పుడైతే వైదిక ధర్మం పూర్తిగా తప్పు దారి నడిచినప్పుడు ఇది అవసరమైంది.

జైన దర్శనం:


కేవలం కనిపించే దాన్నే మాత్రం కాదు నమ్మడం, ఆత్మ అనేదాన్ని కూడా నమ్మాలి అని చెప్పేది జైన దర్శనం. మహావీర్ జైన్ అనే మహానుభావుడు ఈ దర్శనాన్ని అందించాడు. ఆత్మ ఈ శరీరంలో చిక్కి ఉంటుంది కనుకనే శరీరం పని చేస్తుంది, అది వదిలి పెట్టాక పైకి గతి సాగిస్తుంది అని ఈ దర్శనం చెబుతుంది. కనిపించని దాన్ని కొంత వరకు అంగీకరిస్తుంది ఈ దర్శనం.


బౌద్ద దర్శనం:


ఆపై బౌద్ద దర్శనం నాలుగు రకాలుగా వచ్చింది. వారు కనిపించిన దాన్ని కూడా నమ్మరు. కేవలం ఊహను మాత్రమే నమ్ముతారు. మనం చూసే ఈ ప్రకృతి ఇవన్నీ రోజు రోజుకి మార్పు చెందుతున్నాయి, కనుక వాటిని నమ్మరు. జగత్తు అంతా మారుతుంది కనక ఇది అనిత్యం, అనిత్యం కనుక అసత్యం అని చెబుతారు. అసత్యం కనుక జగత్ అంతా మిథ్య అని వారి అభిప్రాయం. మోక్షం అంటే దీపం ఆరిపోయినట్లు, ఆత్మ వినాశం అని నమ్ముతారు. ఆకాలంలో వేదాన్ని ఆచరించే వారు తప్పుడు దోవలో ఉన్నందుకు, అట్లాంటి మార్గం నుండి తప్పించాల్సి వచ్చింది, దైవాన్ని నమ్మి తప్పులు చెయ్యడం అనేది గొప్ప అపచారం. అందుకే ఇలాంటి నాస్తిక సిద్దాంతాలు బయలుదేరాయి. ఒక గోడ కడుతుంటే అది వంకరగా వస్తే కూల్పి కటాల్సిందే, అట్లానే సరియైన వేద ఆచరణని స్థాపించడానికి, ముందు ఆచరణలో ఉన్న తప్పుడు సంప్రదాయాలని తొలగించాల్సిన అవసర ఏర్పడింది. తరువాత వైదిక సిద్దాంత పునర్ స్థాపన కొరకు శంకరాచార్యులు, రామానుజాచార్యులు ఈ సిద్దంతాన్ని ఖండించారు. వేదంలోని తప్పును సరి చేయడానికి వచ్చిన సిద్దాంతాలు. వారు మంచినే కోరారు. సంఘంలో శాంతిని నెలకొలిపాలి అనేది వారి లక్ష్యం. కానీ దురదృష్టకరం ఈనాడు వారు చేసే జీవ హింస, బ్రతికి ఉన్న జీవులని అట్టే తినే సంప్రదాయాలు తయారు అయ్యాయి.

Wednesday, November 16, 2016

సనాతన వైదిక ధర్మం - 7

వేదవ్యాసుడు ప్రతిపాదించిన 'బ్రహ్మ సూత్రాలు'


వేదాన్ని వివరంగా తెలిపే గ్రంథాలను అంగీకరించేప్పుడు వేదానికి విరుద్దంగా లేని వాటిని ప్రామాణికంగా తీసుకుంటాం. కపిలుడు, బుద్దుడు భగవంతుని అవతారాలైనప్పటికీ వారు చెప్పినవి ప్రామాణికం కాదు. కపిలుడు చెప్పిన విషయాలు కేవలం ప్రకృతి గురించి మాత్రమే, బుద్దుడు చెప్పిన విషయాలు ఊహ లేక అనుమానం వరకే అందుతాయి. అవి ఆయా కాల పరిస్థితులను బట్టి చెప్పినవే కానీ, వాస్తవాలు కావు. వేదాన్ని ఆచరించేవారు వాటిని ఖండిస్తారు.

వేదాల విషయానికి వస్తే ప్రతి వేదంలో ముఖ్యంగా మూడు విభాగాలు ఉంటాయి. అవి సంహితలు, బ్రాహ్మణాలు మరియూ ఆరణ్యకాలు. ఆరణ్యకాలలో ఉపనిషత్తులు ఉంటాయి. వేద వ్యాసుడు మహాభారతాన్ని వ్రాసే సమయంలో ఎందరో ఋషుల మధ్య ఎన్నో సందేహాలు ఉండేవి. ఒక్కో ఉపనిషత్ కొన్ని విషయాలను తెలుపుతాయి కనుక. వారు ఒకచోట కలిసినప్పుడు చర్చించేవారు. అయితే ఎవరి అభిప్రాయాలు వారికి ఉండేవి. వారి అందరి కోరిక కేవలం వాస్తవాన్ని శోదించడం, తరువాత తరాల వారు బాగుపడటానికి విలువైన విషయాలను అందించడం. అందుకే వారిని గొప్ప శాస్త్రజ్ఞులు అని అంటారు. వారికి ఉన్న శ్రద్ద అట్లాంటిది. ఇంద్రుడు కూడా ప్రజాపతుల ఆశ్రమాలలో ఎనూట ఇరవై సంవత్సరాలు గడిపాడు అని తెలుస్తుంది. ఎవరికి తోచినట్లు వారు చెప్పడం కాక, వారి చర్చలు వేదాలను అనుసరించి ప్రామాణికంగా ఉండేవి.

అట్లా వారికి ఏర్పడ్డ సందేహాలను, భిన్న భిన్న అభిప్రాయాలను తొలగించేందుకు వేదవ్యాసుడు లోకంలో అన్ని చోట్ల నుండి ఋషులని పిలిపించి పెద్ద సత్రాన్ని ఏర్పాటుచేసాడు. ఒక పెద్ద యాగం జరిగింది. దానికే 'సత్రయాగం' అని పేరు. కొన్ని సంవత్సరాలు జరిగింది ఆ యాగం. ఆరాధన చేయగానే అందరూ చర్చ జరిపేవారు. అందులో ఒక్కొక్కరు వారికి అర్థం అయ్యింది తెలిపేవారు. దాన్ని తీసుకొని అందరూ తమ తమ అభిప్రాయాన్ని ప్రామాణికంగా తెలిపేవారు. అందరూ కలిసి ఒక సారాంశాన్ని తేల్చేవారు. అది వేదానికి అనుగుణంగా ఉండేది, అందరి సంశయాలని తొలగించేది. ఆరణ్యకాలలోని ఉపనిషత్తుల సారంగా, ఆ సత్రయాగం జరిగిన సమయంలో ప్రతిపాదించబడ్డ విషయాలనన్నింటినీ వేదవ్యాసుడు ఒక సారాంశంగా వ్రాసాడు. వాటినే బ్రహ్మ సూత్రాలు అని అంటారు. అందులో 545 సూత్రాలు ఉంటాయి. అందులో ఆత్మ యొక్క గతి, దాని ప్రయాణం ఎట్లా సాగుతుంది, మానవ జన్మకి ఎట్లా వస్తుంది, లేక మరొక జన్మకి ఎట్లా వెళ్తుంది, మనిషి బ్రతకడానికి అవసరమైన విధులు అన్నీ ఉంటాయి. మనిషి యొక్క శారీరక విధులైన దంతదావన-దంతాలు శుభ్రపరచుకోవడం, జిహ్వాలేకనం -నాలుక శుభ్రపరచుకోవడం, గండూషణం - నోరు పుక్కిలించడం, స్నానం ఆచరించడం, దైవారాధన, అల్పాహారం తీసుకోవడం ఇలామనం లేచిన సమయం మొదలుకొని తిరిగి రాత్రి విశ్రాంతి తీసుకొనేంత వరకు మనం చేయాల్సిన ప్రతి ఒక్కటీ ఎట్లా క్రమంగా చేయాలో తెలుపుతాయి. దీన్నే సామాన్య శాస్త్రం అని అంటారు. 



మహాభారతంలోని భగవద్గీత, వేదాలలోని ఉపనిషత్తులు మరియూ బ్రహ్మ సూత్రాలు, ఈ మూడింటి ఆధారంగానే మన ఆచార్యులు సంప్రదాయాలను లేక సిద్దంతాలను స్థాపించడం జరిగింది. ఈ మధ్య కాలంలో వైదిక సంప్రదాయాలు ఇట్లా ఏర్పడ్డవి అనేది గుర్తించాలి. 

Wednesday, September 5, 2012

సనాతన వైదిక ధర్మం - 6

ఉపబ్రాహ్మణాలు - వ్యాఖ్యాన గ్రంథాలు


ఇవి వేదంలో కనిపించక సూక్ష్మంగా ఉన్న విషయాలను స్పష్టంగా కనబడేట్టు చేస్తాయి, ఒక భూతద్దం వలె. భూతద్దం ఉన్న వాటినే పెద్దగా చేసి చూపిస్తుంది కానీ కొత్తవాటిని కల్పించదు అట్లానే. వేదాలు అపౌరుషేయం కానీ వివరణ వ్యాఖ్యానాది గ్రంథాలు అన్నీ మనుషులు చేసినవే. వేదాంగాలు వేదాలలోని అర్థాన్ని నిర్ణయించేవి. భూతద్దంతో చూస్తే మరింత స్పష్టంగా కనిపించినట్లు వేదాన్ని వివరించి చూపేవి వ్యాఖ్యానాలు.
వేదంలోని అర్థాలని మరింత వివరించి చెప్పే గ్రంథాలు ఉన్నాయి. అవి.

1. స్మృతి


మన ఋషులు ఆచరించి మనకు అందించిన ధర్మ శాస్త్రాలను స్మృతి అని అంటారు. అన్నింటిలో మను స్మృతి మొట్ట మొదటిది. అట్లానే పరాశర స్మృతి, హారీత స్మృతి మొదలైనవి. సమాజంలో ప్రతి ఒక్కరి  బాధ్యతలను, వారు వారు ఎట్లా బ్రతికాలో తెలిపేవి. శిశువు జన్మించినప్పుడు చేసే జాతకర్మ, శిశువు పెరిగేప్పుడు ఎప్పుడు అన్నప్రాసన చేయాలి, అక్షరాభ్యాసం ఎప్పుడు చేయాలి, వివాహాది క్రియలు మొదలుకొని  మనిషి మరణించిన తరువాత వరకు చేయాల్సిన అనుష్టానాలని చెబుతాయి. కుటుంభాలలో చేయాల్సిన విధులని కూడా తెలుపుతాయి. అవి సూత్రాలవలె ఉంటాయి. కుటుంభాలకు సంబంధించినవి గృహ్య సూత్రాలు, సమాజానికి సంబంధించినవి స్రౌత సూత్రాలు అని అంటారు, యాగం ఎట్లా చేయాలి, వర్షాలు రావాలంటే ఏమి చేయాలి, పిల్లలు కావాలంటే చేయాల్సిన యాగాలు, కొన్ని కోరికల కోసం చేయాల్సినవి. వేదాలలోని విషయాలనే సూత్రాలుగా మార్చి వ్రాసినవి.

2. ఇతిహాసాలు


మరి స్మృతిని ఎట్లా నమ్మడం? దాన్ని ఆచరించినవారి గురించి తెలిస్తే మనకు నమ్మకం వస్తుంది. అట్లా ఆచరించిన వారి చరిత్రను మనకు అందించారు, అవే ఇతిహాసాలు. అవి ఎట్లా అయితే జరిగాయో అట్లానే తీసుకోవాలి. చరిత్రను మార్పు చేయకూడదు. ఇతిహాసాలు రెండే. అవి రామాయణం మరియూ మహా భారతం. రామాయణాన్ని తీసి చూస్తే రామాయణంలోని ఏదో ఒక పాత్రలో మనల్ని చూసుకోవచ్చు. అప్పుడు మనం ఎట్లా బతికితే బాగుపడతామో సవరించుకొని బ్రతకవచ్చు.

3. పురాణాలు


వేదాలలోని విషయాలని తెలిపి మనల్ని ఉత్తేజపరచడానికి వచ్చినవే పురాణాలు. వేద వ్యాసుడు అందించినవి. 18 పురాణాలు ఉన్నాయి. 18 ఉప పురాణాలు ఉన్నాయి. పురాణ అంటే పాతవి అని అర్థం కాదు, 'పురాపి నవం' పాతవి కానీ ఎప్పటికీ స్వచ్చంగా ఉండేవి. కొన్ని కథల రూపంగా ఉంటాయి, కొన్ని కథలు జరిగినవి కాక పోవచ్చు, అవి నిజంగా జరిగాయా అని ఆలోచించాల్సిన అవసరం లేదు, అక్కడి సారాంశాన్ని మనం అర్థ చేసుకోవాలి. ఇతిహాసాలలో ప్రతి విషయం జరిగినట్టే తీసుకోవాలి.

పురాణాలు -
 మద్వయం భద్వయం చైవ బ్రత్రయం వచతుష్టయం |
అనాపలింగ కూస్కాని పురాణాని తథైవచ          ||

 1. మత్స్య పురాణం
 2. మార్కండేయ పురాణం
 3. భవిష్య పురాణం
 4. భాగవత పురాణం
 5. బ్రహ్మ పురాణం
 6. బ్రహ్మాండ పురాణం
 7. బ్రహ్మవైవర్త పురాణం
 8. వరాహ పురాణం 
 9. వామన పురాణం
10. వాయు పురాణం
11. విష్ణు పురాణం
12. అగ్ని పురాణం
13. నారద పురాణం
14. పద్మ పురాణం
15. లింగ పురాణం
16. గరుడ పురాణం
17. కూర్మ పురాణం
18. స్కంద  పురాణం
ఉప పురాణాలు -
 1. సనత్కుమార పురాణం
 2. నరసింహ పురాణం
 3. శివధర్మ పురాణం
 4. దౌర్వాస పురాణం
 5. నారదీయ పురాణం
 6. కాపిల పురాణం
 7. మానవ పురాణం
 8. ఔసనశ పురాణం
 9. బ్రంహాండ పురాణం
10. వారున పురాణం
11. కౌశిక పురాణం
12. లైంగ పురాణం
13. సాంబ పురాణం
14. సౌర పురాణం
15. పారాశర పురాణం
16. మారీచ పురాణం
17. భార్గవ పురాణం
18. స్కాంద పురాణం
  

4. ఆగమాలు

మనం ఆచరించేప్పుడు మనం అభ్యాసం చేసుకోవడానికి ఎట్లాటి ఏర్పాటు చేసుకోవాలో తెలిపేవి ఆగమాలు. వేదాలు చెప్పిన విష్ణువుని, శివుడిని ఎట్లా ఆరాధించాలో తెలిపేవి వైష్ణవ, శైవ ఆగమాలు. ఆరాధించేప్పుడు ఆ దేవుడు ఎట్లా మనం చూపిన విగ్రహాన్ని స్వీకరిస్తాడో తెలుపుతాయి. ఆలయాల్లోని వివిద కార్యక్రమాలు ఎట్లా చేయాలో తెలుపుతాయి. పాంచరాత్ర, వైఖానస ఆగమాలు వైష్ణవ ఆగమాలు.  పాంచరాత్ర నారాయణుడు అందించినదే. శైవం, పాశుపతం శైవ ఆగమాలు. శక్తి, దుర్గ, కాత్యాయని వంటి స్త్రీ దేవతల ఆరాధనా పద్దతులని తెలిపేవి శాక్తేయ ఆగమాలు. గ్రామ  దేవతలు అని గ్రామాల్లో సంవత్సరానికి ఒక సారి పూజిస్తుంటారు వాటిని తెలిపేవి గాణాపత్యం అని ఆగమాలు. కొన్నింటిని అదిపతిగా కల్గిన దేవతలను గణపతి అంటారు. అందుకే గాణాపత్యం అని పేరు. అవి కూడా కొన్ని పద్దతులు, అయితే అవి మనం పాటించవచ్చా, కూడదా మనం ఆలోచించాల్సినది. కొందరు తామస గుణాలను కోరుతారు, వారు అట్లాంటి దేవతలనే పూజిస్తారు. మనం సాత్వికాన్ని కోరినప్పుడు మనం కోరుకున్నదేదో ఇచ్చే దేవతని మనం పూజించాలి. ఇవన్నీ లోకంలో ఉన్న పద్దతులు. నారాయణుడే పరతత్వం అయినప్పుడు ఇన్ని దేవతలు ఎందుకు అని అనిపిస్తుంది, కానీ మనిషి జ్ఞానాన్ని బట్టి ఆయా దేవతని పూజిస్తారు, అందరికి జ్ఞానంలోని స్థాయి నారాయణుడి వరకు వెళ్ళక పోవచ్చు. కానీ ఉన్నవారిని కాదనలేం, మనకు ఎవరు కావాలో మనం చూసుకొని బ్రతకాలి. గడ్డితినే ఆవు, ఆ గడ్డి ఇచ్చే బియ్యాన్ని తినే మనిషిని ఒకే వద్ద ఉంచాడు భగవంతుడు అది భగవంతుని గొప్పతనం. మనకు కావల్సినదేదో తెలుసుకొని తినాలి.

5. ప్రబంధాలు

అట్లా దేవతలని ఆరాధించేప్పుడు వారిని ఎట్లా స్థుతించాలో తెలుపడానికి వచ్చినవి ప్రబంధాలు. ప్రబంధాలు అంటే పై విషయాలను అనుభవించి వారి వారి భాషలలో అందంగా వ్రాసిన కావ్యాలని ప్రబంధాలు అని చెబుతారు. రామాయణాన్ని ఎందరో ఎన్నో భాషలుగా వ్రాసుకున్నారు, అవన్నీ ప్రబంధాలు. ఆళ్వారులు తమిళ భాషలో వ్రాసారు, అవీ ప్రబంధాలే. ఇవన్నీ వేదంలోని విషయాలను తెలుపడానికే వచ్చినవి.
అయితే స్మృతులు మొదలుకొని ప్రబంధాల వరకు పురుష నిర్మితాలు. మరి వాటిని ఎట్లా ప్రమాణంగా తీసుకోవడం ? వేదాలకు విరుద్దంగా కాకుండా వేదానికి అనుగుణంగా చెప్పే స్మృతులు అంగీకరించవచ్చు. ఇతిహాసాలలో ఎన్నో విషయాలు ఉండవచ్చు, అందులో వేదాలు, స్మృతులు చెప్పిన విషయాలను మాత్రం తీసుకోవాలి. పురాణాలలో ఇతిహాసాల విషయాలను చూపే వాటిని మనం ప్రమాణంగా తీసుకుంటాం. ఆగమాల విషయాలలో వేదాల్లో, స్మృతులలో, ఇతిహాసాలలో మరియూ పురాణాలలో అంగీకరించిన క్రమంలో ఉన్న వాటినే ప్రమాణంగా స్వీకరిస్తాం. ప్రబంధాలు అట్లానే ప్రమాణికమైనవే అంగీకరిస్తాం. పౌరుషేయాలైన ఉపబృంహణాల విషయంలో వేదం చెప్పినవాటినే అంగీకరిస్తాం

వేదం తెలిపేది ధర్మాన్ని

వేదాలు చెప్పేవి ముఖ్యంగా ధర్మం గురించే. శాస్త్రాలు ఎక్కడా ధర్మాన్ని వదిలేయమని చెప్పవు. ఇది గుర్తుకు పెట్టుకోవాలి. మనం కర్మ ఆచరణను ఎట్లా చేయాలో తెలుపుతాయి, కానీ మన కర్మని వదిలివేయడం అనేది ఉండదు. ధర్మం అనగానే ఇది ఒక మతపరమైనది అని భావన. కానీ అది తప్పు. జీవితం వేరు, మతం వేరు కాదు. ధర్మం అనేది మనం ఆచరించేది, ఒక్కోసారి మనం చేసేది వృదా అవుతుంది అన్నట్టు అనిపిస్తుంది కానీ అది ఒకనాడు మన కష్టకాలంలో కాపాడుతుంది. మనం ధనాన్ని దాచుకుంటే అది వడ్డీతో పాటు మన అవసరానికి ఆదుకుంటుందే అట్లానే ధర్మం కూడా. అన్నింటికీ అర్థం తెలియనవసరం లేదు కానీ మనం ఆచరించాలి. అది కేవలం ఈ లోకం కోసమే కాదు పరలోకంలో కూడా మనల్ని రక్షించేది.
ధర్మం అంటే ఏమిటో ఆపదం ఏర్పడ్డ ధాతువుల నుంది తెలుస్తుంది. 'ద్రియతే ధారయతే ఇతి ధర్మః'. మనం మొదట ధర్మాన్ని ఆచరిస్తాం, ఆపై అది మనల్ని రక్షిస్తుంది. ధర్మం అంటే ఏమిటో మన ఋషులు అందమైన వివరణ ఇచ్చారు, 'ఎతో అభ్యుదయ నిశ్శ్రేయస సిద్దిః స ధర్మః'. మనం అసలు కోరేది ఏమి అంటే అది ఆనందం. ఎక్కడ ? మనం ఎక్కడ ఉన్నా ఆనందంగా ఉండాలి. అంటే ఇక్కడ ఉండగా ఆనందంగా ఉండాలి. ఇక్కడి నుండి ఏలోకానికి వెళ్ళినా అక్కడా అనందంగా ఉండాలి. స్వర్గంలో ఉన్నవారు కూడా ఆనందంగా ఉండరట. అక్కడ ఉన్నప్పుడు అక్కడి సుఖాలకు అలవాటు పడి ఉంటారు. అది వదులుకోవాలని అనిపించదు వారికి. అక్కడ వారు కోరినవి అన్ని లభిస్తాయి, కానీ అక్కడ ఉండటం అనేది మన పుణ్యం ఉన్నంత వరకే. అది ఖర్చు అయ్యాక తిరిగి ఇక్కడికి రావల్సిందే. అక్కడ మనం అనుభవించడం వరకే మనం చేయగలిగేది కానీ పుణ్యాన్ని అంటూ సంపాదించే అవకాశం ఉండదు. ఏది సంపాదించాలన్నా తిరిగి భూమిపై మాత్రమే సాధ్యము. వేదాన్ని అర్థం చేసుకొని బ్రతికేవారు ఎప్పుడూ స్వర్గాన్ని కోరరు. నేరుగా భగవంతుని వద్దకే వెళ్ళాలని కోరుకుంటారు, లేకుంటే ఇక్కడే ఉండాలి అని కోరుకుంటారు. పరమపదానికి వెళ్ళాలంటే భూమి నుండే వెళ్ళే అవకాశం ఉంది తప్ప స్వర్గాది లోకాలల నుండి కాదు. మనం ఒక్కటి చేసి అన్ని ఫలాలు అందించగలిగేది ధర్మం అంటే. అయితే స్వర్గాది లోకాలకు వెళ్ళాలన్నా, నిత్య నిలయమైన పరమపదానికి వెళ్ళాలన్నా మనం ధర్మాన్ని ఆచరించవలసిందే.

ధర్మం అనేది చెప్పేది కాదు. అందరూ తప్పక ఆచరించాల్సింది. ఎందుకు తప్పని సరిగా ఆచరించాలి. మనంతట మనం ఒకరికి హాని చేయక  మన దారిన మనం బ్రతకుతున్న వారు కూడా ధర్మాన్ని ఆచరించాలా, అలా బ్రతికితే చాలదా ? అనేది కొందరి ప్రశ్న. అది సరియైనదే, కానీ మనం పొందాల్సిన అసలు ఫలం కూడా ముఖ్యమే కదా. అది కూడా ఆలోచించుకోని బ్రతకాలి. అయితే మనిషి జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. ఈర్ష, అసూయ, ద్వేషం వంటివి మనం ఎంత కాదన్నా తప్పక కలుగుతుంటాయి. ఒక చెట్టు తాను ఏమి ఆశించక లోకానికి ఎంత ఉపకారం చేస్తుంది. మనం కనీసం ఒక చెట్టు చేస్తున్న ఉపకారం అయినా చేస్తున్నామా. అట్లా చూస్తే మనిషి చెట్టుకంటే ఎంతో చేయగలడు, అట్లా చేయక ప్రకృతిలోని ఎన్నింటినో మనం వాడుకుంటున్నాం, అప్పుడు మనం ప్రకృతిని దొంగలించినట్లే కదా లెక్క. మనిషి యొక్క యోగ్యత చెట్టు కంటే చాలా గొప్పది. అది ఆలోచించి బ్రతకాల్సిన భాద్యత మనిషిది. అట్లా మనిషి ఆచరించాల్సినదే ధర్మం అంటే. ఆధర్మాన్నే మన ఋషులు ఆచరించి మన వరకూ అందించారు. ఎలా తెలియాలి ధర్మం అంటే 'వేదోఖిలో ధర్మ మూలం'. వేదంలోని ప్రతి అక్షరం ధర్మాన్ని చెప్పడానికే.
 అయితే అన్ని వేదాలను కలిపి చూస్తే అవి మనం ఆచరించాల్సిన ధర్మం గురించి తెలుపుతాయి. ఎట్లా ఆచరించాలి ? అంటే క్రమశిక్షణ తో ఆచరించాలి. మనకు వెంటనే ఫలితం రాకుంటే ఏం చేయాలి ? ఆపకూడదు, మన కృషి చేస్తూనే ఉండాలి. ఫలితం వస్తుందా ? అంటే తప్పక వస్తుంది. మనం అలవర్చుకోవాల్సింది ఈ లోకంపై , పరలోకం పై నమ్మకం మరియూ మనపై, భగవంతునిపై విశ్వాసం. వేదాలు మన ఆచరణ ఎట్లా ఉండాలో తెలుపుతాయి, దాన్నే ధర్మం అని అంటారు. 
(ఇంకా ఉంది...) 

Sunday, August 19, 2012

సనాతన వైదిక ధర్మం - 5

ధర్మం అంటే ?


'వేదోఖిలో ధర్మ మూలం' వేదం అనేది మన ఆచరించాల్సిన సాధనాలను తెలిపేవి. వేదాలు తెలిపిన నియమాలని, ఆచరణని పాటించడమే ధర్మం అంటే. 'ధ్రియతే ధారయతే ఇతి ధర్మః'. 'ధారయతే' - మనం చేయాల్సిన సాధన. ముందు మనం ఆచరిస్తాం, 'ధ్రియతే' ఆపై ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఉదాహరణగా ముందు మనం సైకిల్ నడపడం నేర్చుకుంటాం, ఆతరువాత అదే మనల్ని నడిపిస్తుంది. అట్లా ధర్మాన్ని మనం మొదట ఆచరిస్తే, అది మనల్ని కాపాడుతూ సులువుగా మన లక్ష్యం వైపు తీసుకెళ్తుంది. మరొక ఉదాహరణగా ఒక గింజను మనం నేలలో నాటి నప్పుడు, అది వృదా అయినట్లు అని పిస్తుంది, కానీ కొంతకాలానికి తనలోంచి అనేక గింజలను పుట్టిస్తుంది. అట్లా మనం చేసే సాధన కొంత కష్టంగా అనిపించినా అది మనకు ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. ఇలా ధర్మాన్ని మన పూర్వులైన ఋషులు ఆచరించి ఫలితం పొందారు. వారు దాన్ని వారి శిష్యులకు అందించారు. విష్ణుసహస్రనామ స్తోత్రంలోని ఉత్తర పీఠికలో 'ఆచార ప్రభవో ధర్మః' అని చెబుతుంది. ఆచరించిన చూపిన వారి ఆచరణలే ధర్మాలు అయ్యాయి. మనం చేయాల్సినదేమి, చేయకూడనిది ఏమి అని విధి నిషేదాలను వేదాలు తెలుపుతాయి. అందుకే మనిషి ఈ ప్రకృతిలో ఎట్లా బ్రతకాలి అనే విషయాలని తెలుపుతాయి వేదాలు.

వేద శాఖలు


ఋషులు మొదట దర్శించిన వేద శబ్దాలను అట్లే వారు తమ శిష్యులకు అందించారు. వేద మంత్రాలలోని ఆయా లక్షణాలను బట్టి ఋగ్వేదం, యజుర్వేదం, సామ వేదం మరియూ ఆదర్వణ వేదం అని నాలుగు భాగాల క్రింద విడదీసి చెబుతారు. అయితే వీటన్నింటినీ ఒకే రాశి క్రింద ఒక్కరే నేర్వగల సామర్థ్యం ఉండేది. అవి కేవలం నోటిద్వారా నేరవాల్సిందే కానీ పుస్తక రూపంలో కాదు. అందుకే వాటిని నిలుపుకునే సామర్థ్యం రానున్న తరాలకు ఉండదని తెలిసి వాటిని వేదవ్యాసుడు కొందరు శిష్యులకు కొంత కొంత విభజించి ఇచ్చాడు. వారు తమ శిష్యులకు మరిన్ని ఉపశాఖలుగా విభజించి ఇచ్చారు. శ్రీమన్నారాయణుడు కూడా వేదాన్ని తయారు చేయలేదు, ఆయన మొదట దర్శించి చతుర్ముఖ బ్రహ్మకు అందించాడు. ఆయన తన పుత్రులకు అందించాడు. ఇలా మన ఋషుల వరకు అందాయి. ఒకప్పుడు మన వద్ద ఉన్న వేద రాశి ఎంతో తెలుసుకుందాం.
వేద వ్యాసుడు మొత్తం వేదాన్ని 1131 శాఖలుగా విభజించాడు. అందులో ఋగ్వేదం 21 శాఖలుగా, యజుర్వేదం 101 శాఖలుగా, సామ వేదం 1000 శాఖలుగా మరియూ ఆదర్వణ వేదం 9 శాఖలుగా ఉండేది.

ఒక్కో వేదం మూడు విభాగాల క్రింద ఉంటాయి అవి.
 1. సంహితలు, 2. ఆరణ్యకములు మరియూ 3. బ్రాహ్మణములు

ఋగ్వేదం

ఋగ్వేదాన్ని దర్శించినప్పుడు ఆ వేదాన్ని ఒక రూపుతో దర్శించారు కనుక ఋగ్వేద పురుష అని వ్యవహరిస్తారు.
ఋగ్వేదః శ్వేత వర్ణస్యాత్ ద్విభుజో రాసబాననః |
అక్షమాలాదరః సౌమ్యః ప్రీతో వ్యాఖ్యా కృతో ద్యమః ||






ఋగ్వేద పురుషుడు తెలుపు రంగులో ఉంటాడట. గాడిద ముఖం కలిగి ఉంటాడట. చేతిలో మాల ధరించి ఉంటాడట. ప్రశాంతంగా కనిపిస్తూ వేదాన్ని అందించాడట.
సంహితలు ఎనిమిది ఆష్టకములుగా ఉంటుంది. ఒక్కో అష్టకం ఎనిమిది అధ్యాయాలుగా ఉంటుంది. మొత్తం 1028 సూక్తులుగా ఉంటుంది. 10552 ఋక్కులు (మంత్రాలు) ఉంటాయి. మొత్తం 397265 అక్షరాలు ఉంటాయి.
ఈ మొత్తం 21 శాఖలుగా విభజించారు. సంహితలని ఆ శిష్యుల పేర్ల రూపుతో వ్యాస, పైల, ఇంద్రప్రమాతి, మాండుకేయ, సత్య స్రవస్, సత్య హిత మరియూ సత్యశ్రీగా విభజించారు. ఒక్క సత్యశ్రీ శాఖను తీసుకుంటే అది వారి శిష్యులైన సాఖల, సాఖపూణి మరియూ భాష్కల అని మూడుగా విభాగం అయ్యింది. సాఖల మరో ఐదు భాగాలుగా, భాష్కల నాలుగు భాగాలుగా విభాగం అయ్యింది.
ఋగ్వేదంలో ఉపవేదంగా ఆయుర్వేదం ఉంటుంది.
బ్రాహ్మణాలు నాలుగు భాగాలుగా, అవి పైంగ, బహ్-వ్రిచ, ఆశ్వలాయణ, గాలవ బ్రాహ్మణాలుగా విభాగం అయ్యాయి.
ఆరణ్యకాలలో ఉపనిషత్తులు ఉంటాయి. అవి నిర్వాణ, ఐతరేయ, బహ్-వ్రిచ, సౌభాగ్య, కౌశీతకి, ముద్గల, నాదబిందు, త్రిపుర, ఆత్మ ప్రభోద మరియూ అక్షరమాలిక అని పది ఉపనిషత్తులుగా ఉంటాయి.

యజుర్వేదం

యజుర్వేద పురుషుడిని ఇలా దర్శించారు.

అజస్యపీత వర్ణస్యాత్ యజుర్వేదో అక్షసూత్ర ద్రుత్ |
వామే కులిసపాణిస్తూ భూతిదో మంగళప్రదః ||






మేక ముఖం కలిగి పసుపు రంగులో ఉంటాడు. ఎడమ చేతిలో కర్ర పట్టుకొని ఉంటాడు. సంపదలని, శుభముని ఇచ్చేలా ఉంటాడు.
యజుర్వేదం రెండు భాగాలు ఉంటుంది. శుక్ల యజుర్వేదం మరియూ కృష్ణ యజుర్వేదం. శుక్ల యజుర్వేదం  కాన్వ మరియూ మాద్యందిన అనే శాఖలుగా ఉంటుంది. కృష్ణ యజుర్వేదం తైత్తిరీయ, మైత్రాయణి, కఠ మరియూ కపిస్తల అనే శాఖలుగా ఉంటుంది.
కాన్వ శాఖ 40 అధ్యాయాలు, 328 అనువాకాలు, 2086 మంత్రాలుగా ఉంటుంది. మాద్యందిన 40 అధ్యాయాలు, 303 అనువాకాలు, 1975 మంత్ర ఖండాలు, 3988 మంత్రాలు, 29626 పదాలు, 88875 అక్షరాలుగా ఉంటుంది. ఇంత లెక్కతో జాగ్రత్తగా బద్రపరిచారు. తైత్తిరీయ శాఖ 7 ఖాండాలు, 44 ప్రపాతకాలు, 635 అనువాకాలుగా ఉంటుంది. మైత్రాయణి శాఖ 4 ఖాండాలు, 54 ప్రపాతకాలు, 2144 మంత్రాలుగా ఉంటుంది. కఠ శాఖ 5 ఖాండాలు, 40 ఆధ్యాయాలు, 13 అనువాచకాలు, 843 అనువాకాలు మరియూ 3091 మంత్రాలుగా ఉంటుంది.
బ్రహ్మణాలు చరక, కాతక, తుంబుర, జాబల, కన్కతి, స్వేతాస్వేతర, మైత్రాయణి, ఖాందికేయ, హారిద్ర, ఆహ్వరాక, ఔకేయ మరియూ చాగలేయ అనే శాఖలుగా ఉంటుంది.
శుక్ల యజుర్వేద ఉపనిషత్తులు ఈసావాస్య, బృహదారణ్యక, జాబాల, సుభాల మొదలైనవి.
కృష్ణ యజుర్వేద ఉపనిషత్తులు కఠ, తైత్తిరీయ, స్వేతాస్వేతర మొదలైనవి.

సామ వేదం


సామ వేద పురుషుడిని ఇలా దర్శించారు.

నీలోత్పలధలశ్యామోః సామవేదో హయాననః |
అక్షమాలాఅన్వితోదక్షే వామే కుంభదారణ స్మృతః ||






కృష్ణుడి వంటి నీలి రంగులో, గుఱ్ఱపు ముఖం కలిగి, ఒక చేతిలో కొరడా కలిగి, ఎడమ చేతిలో కుండ కలిగి ఉంటాడు.
సామవేదం మొత్తం 1065 శాఖలుగా ఉంటుంది. అందులో ముఖ్యమైనవి తొమ్మిది. రాణాయణ, సాట్యాయన, సార్యముగ్ర, కల్వల, మహా కల్వల, లాంగల, కౌతుమీయ, గౌతమీయ, జైమినీయ అని ముఖ్య శాఖలు. అందులో రాణాయణ, కౌతుమీయ మరియూ జైమినీయ అనేవి మాత్రం ఉన్నాయి. మిగతా శాఖలు లభించడం లేదు.
సామవేద సంహితలు పూర్వర్చిక, ఉత్తరార్చిక మరియూ ఆరణ్యకాలుగా ఉంటుంది. పూర్వర్చిక 6 ప్రాతకాలు, 59 దషతీలు, 585 మంత్రాలుగా ఉంటుంది. ఉత్తరార్చిక 9 ప్రాతకాలు, 120 దషతీలు, 1220 మంత్రాలుగా ఉంటుంది. ఆరణ్యకాలు 55 మంత్రాలుగా ఉంటుంది.
బ్రాహ్మణాలు భాల్లవి, కాలబవి, రౌరుకి, సాట్యాయన అని నాలుగు భాగాలుగా ఉంటుంది.
ఉపనిషత్తులు చాందోగ్య, కేన, మైత్రాయణి, తల్వకారీయ మరియూ మహోపనిషత్తులుగా ఉంది.

ఆదర్వణ వేదం

ఆదర్వణ వేద పురుషుడిని ఇలా దర్శించారు.


 ఆధర్వణాభిదో వేదో ధవళో మర్కటాననః |
అక్షమాలాన్వితో వామే దక్షే కుంభదరః స్మృతః ||




తెలుపు రంగులో, కోతి ముఖం కలిగి, కుడి చేతిలో మాల ధరించి, కుడిచేతిలో కుండ కలిగి ఉంటాడు.
ఆదర్వణ వేదం 15 శాఖలు, 20 ఖండాలు, 736 సూక్తాలుగా ఉంటుంది. పైప్పాలద, సౌనక అనే శాఖలు మాత్రం లభిస్తున్నాయి.
శిల్పవేదం ఉపవేదంగా ఉంది.
బ్రాహ్మణాలలో గోపత బ్రాహ్మణం ఉంటుంది.
ఆరణ్యకాలు ఏవీ లభించడం లేదు, మొత్తం 31 ఉపనిషత్తులలో ప్రస్న, ముండక, మాండుక్య అనేవి లభిస్తున్నాయి. 

వేదాంగాలు- వివరణ గ్రంథాలు


మనం ఈనాడు పాశ్చాత్యులు చూపిస్తున్న విజ్ఞానామే గొప్ప అని భావిస్తున్నాం, కానీ మన వేదాలలో ఎంతో విజ్ఞానం ఉందని మరచి ప్రవర్తిస్తున్నాం. వేదాలు ఏమిటో తెలుసుకోవాలని ఈ నాడు పాశ్చాత్యులు ఉత్సాహం చూపిస్తున్నారు, కానీ దురదృష్టకరం మనం వాటిని ఆదరించడం లేదు. దాన్ని కొంతనైన అర్థచేసుకొనే ప్రయత్నం చేద్దాం.
వేదాలు ముఖ్యంగా ఋగ్,యజుస్,సామ మరియూ ఆదర్వణ విభాగాలుగా ఉంది. ఇంత వేదరాశి సహజమైన శబ్దాలు. అందులో ఎంతో జ్ఞానం నిగూఢమై ఉంది. మరి ఆ అర్థాన్ని ఎట్లా తెలుసుకోవడం ?  వేదాన్ని అర్థం చేసుకోవడానికి మన ఋషులు వాటికి ఎన్నో వివరణ గ్రంథాలను ఇచ్చారు. వేద రాశి యొక్క అర్థ నిర్ణయాని కొరకు. వీటినే వేదాంగాలు అని అంటారు. అవి ఆరు.

1. శిక్షా

వేద శబ్దాల మూలాలు, ధాతువులని బట్టి ఆయా శబ్దాల  ఉచ్చారణ, స్వరములని చెప్పేది. వేదాన్ని ఎట్లా పలకాలో తెలుపుతుంది.

2. వ్యాకరణం

కొన్ని శబ్దాలు ఒక్కో చోట ఒక్కోలా ఉచ్చరించాల్సి ఉంటుంది, అవి ఎట్లాలో చెప్పేది వ్యాకరణం. ఎన్నో ధాతువుల నుండి అర్థాన్ని చెబుతాయి. ఉదాహరణ మానవ అనే పదం. మను అనే మహర్షి యొక్క సంతతి కనక మానవ అయ్యింది.

3. కల్పకం

వేద యజ్ఞంకోసం చేయాల్సిన యాగ శాల, వేదిక ఎట్లా ఉండాలి అనే విషయాలను తెలిపేది కల్పకం.

4. నిరుక్తం

పదాలు ఎట్లా తయారు అయ్యాయో తెలుపుతుంది. మనుష్య అనే పేరు ఎట్లా వచ్చింది అంటే 'మత్వా కర్మాణి సీవ్యతి'. లోకానికి ఏది కావాలో ముందే ఆలోచించి చేసే వాడు కనక మనిషి అని పేరు.

5. ఛందస్సు

ఛందస్సు అనేది వేద మంత్రాలలోని అక్షరాలను కొలిచేది, శబ్దాల అర్థాలను వివరిస్తుంది. విష్ణుసహస్రనామాలు ఉండేవి అనిష్టుప్ ఛందస్సు, అంటే శ్లోకంలో 32 అక్షరాలు ఉంటాయి. నాలుగు భాగాలు చేస్తే ఒక్కో భాగానికి 8 అక్షరాలు ఉంటాయి. గాయత్రి మంత్రానికి పేరు ఛందస్సుతో ఏర్పడింది. గాయత్రి అనేది ఛందస్సు. కొందరు గాయత్రి మంత్రం అనగానే ఒక స్త్రీమూర్తిని బొమ్మగా వేసి చూపిస్తారు, కాని అది తప్పు. గాయత్రి మంత్రం ప్రతిపాదించే దేవత నారాయణుడు. అందుకే సంధ్యావందనం చేసేప్పుడు సూర్యమండలం మధ్యవర్తిగా ఉండి నడిపేవాడు నన్నూ ప్రేరేపించుగాక అని కోరుతారు. నారాయణుడు ఆ మంత్రం యొక్క దేవత. ఉత్పలమాల, చంపకమాల అనేవి తెలుగులో ఛందస్సు. ఆ పదాలు స్త్రీలింగ శబ్దాలు, అట్లానే గాయత్రి ఛందస్సు కూడా.

6. జ్యోతిషం

మనం ఆచరించాల్సిన పనులు ఎప్పుడు, ఏమి, అట్లా చేయాలో తెలిపేది. చంద్రుడిని బట్టి, సూర్యుడిని బట్టి, ఋతువులని బట్టి కాలాన్ని చెబుతుంది.
పై ఆరిటినే షడంగాలు అని చెబుతారు. ఇవి వేదం యొక్క అర్థాన్ని నిర్ణయించేవి.

(ఇంకా వుంది...)